Kumar Vishwas: నేను బాహుబలిని.. నన్ను చంపేందుకు రోజుకో కట్టప్ప పుట్టుకొస్తున్నాడు.. ‘ఆప్’ నేత కుమార్ విశ్వాస్

  • ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మాహిష్మతి రాజ్యం 
  • శివగామి లాంటి వాళ్లు పాలిస్తున్నారు
  • నన్ను చంపేందుకు రోజుకో కట్టప్ప వస్తున్నాడు
  • గోపాల్ రాయ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కుమార్ విశ్వాస్

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా ఏ ముహూర్తాన విడుదలైందో కానీ, ఇప్పుడు ప్రతీ చిన్న విషయానికి ఆ సినిమాలోని పాత్రలను ఆపాదిస్తూ మాట్లాడుతున్నారు. తెలుగు రాజకీయాల్లో ఇది విపరీతం కాగా, జాతీయ రాజకీయాల్లోకీ ‘బాహుబలి’ ప్రవేశించింది.

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ తనను తాను ‘బాహుబలి’గా అభివర్ణించుకున్నారు. ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వాన్ని మాహిష్మతి సామ్రాజ్యంగా పేర్కొన్న ఆయన దీనిని శివగామిలా వేరొకరు పాలిస్తున్నారని అన్నారు. ఈ బాహుబలి (తనను)ని చంపడానికి రోజుకో కట్టప్ప పుట్టుకొస్తున్నాడని ఆరోపించారు. ఆప్ నేత గోపాల్ రాయ్ తనపై చేసిన వ్యాఖ్యలపై కుమార్ విశ్వాస్ ఇలా స్పందించారు.

ఈనెల 16న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, నరైన్ దాస్ గుప్తా లను ఆప్ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో సీటు ఆశించిన విశ్వాస్ అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు ఇటీవల గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వారిని రాజ్యసభకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. దీంతో అసలే సీటు దక్కక కోపంగా ఉన్న కుమార్ విశ్వాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మునిసిపల్ ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత గోపాల్ రాయ్ నిద్రలేచారని ఎద్దేవా చేశారు. బాహుబలి లాంటి తనను చంపేందుకు కట్టప్పలు పుట్టుకొస్తున్నారని పేర్కొన్నారు.

More Telugu News