Virat Kohli: విరాట్ కోహ్లీపై అసహనం వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా మీడియా

  • మీడియా సమావేశానికి కోహ్లీ డుమ్మా
  • సంజయ్ బంగర్ ను పంపిన కెప్టెన్
  • ప్రాక్టీస్ కూడా ఎగ్గొట్టిన ఆటగాళ్లు

టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ లో నేడు తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ డుమ్మా కొట్టాడు. తన తరపున బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ను పంపించాడు. బంగర్ కూడా ఈ సమావేశానికి గంట తర్వాత వచ్చాడు. ఈ సందర్భంగా, కోహ్లీ వ్యవహారశైలిపై దక్షిణాఫ్రికా మీడియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. మీడియా సమావేశానికి టీమిండియా కెప్టెన్ హాజరుకాకపోవడం ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే జరిగింది. గతంలో కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ సందర్భంగా అప్పటి కెప్టెన్ ధోనీ తన తరపున ఇషాంత్ శర్మను పంపించాడు.

మరోవైపు, మీడియా సమావేశంలో సంజయ్ బంగర్ మాట్లాడుతూ... కోహ్లీ, రవిశాస్త్రిలు ఇప్పటికే మీడియాతో మాట్లాడారని చెప్పాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఈ సమావేశానికి హాజరవుతున్నాడన్న పక్కా సమాచారం కూడా తమ వద్ద లేదని తెలిపాడు. మరోవైపు నిన్నటి ప్రాక్టీస్ సెషన్ ను కూడా మన ఆటగాళ్లు ఎగ్గొట్టారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, జట్టు సిబ్బంది మాత్రమే పిచ్ ను పరిశీలించారు.

More Telugu News