Pakistan: కుల్‌భూషణ్ నోటితో భారత్‌ను తిట్టించిన పాక్.. దాయాది నయా ఎత్తుగడ!

  • మరో వీడియో విడుదల చేసిన పాక్
  • జైలు అధికారులు తనను బ్రహ్మాండంగా చూసుకుంటున్నారన్న కుల్‌భూషణ్ జాదవ్
  • భారత దౌత్య అధికారులే తన తల్లిని అవమానించారని ఆరోపణ
  • కొట్టి పారేసిన భారత్.. పాక్‌కు ఇది మామూలేనంటూ కౌంటర్

దాయాది పాకిస్థాన్ మరో నాటకానికి తెరదీసింది. గూఢచర్యం కేసులో పాక్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌తో భారత్‌ను తిట్టించింది. పాక్ జైల్లో ఉన్న కుమారుడిని చూసేందుకు జాదవ్ తల్లి, ఆయన భార్య ఇటీవల పాకిస్థాన్ వెళ్లారు. ఈ సందర్భంగా కుమారుడిని నేరుగా కలవకుండా ఆంక్షలు పెట్టిన పాక్ అధికారులు జాదవ్ తల్లి మెడలోని మంగళసూత్రాలు, బొట్టును చెరిపివేయించి మరీ కుమారుడిని చూపించింది. పాక్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేసింది. ప్రపంచవ్యాప్తంగానూ పాక్ తీరును పలువురు దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో గురువారం పాక్ విదేశాంగ శాఖ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. అందులో జాదవ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ అధికారులు తనను బాగా చూసుకుంటున్నారని పేర్కొన్నాడు. తనను కలిసేందుకు తల్లి, భార్య వచ్చినప్పుడు ఇక్కడి భారత దౌత్య అధికారి (డిప్యూటీ హై కమిషనర్) అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. తాను ఇప్పటికీ భారత నేవీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానే ఉన్నానని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

తాను గూఢచారిని కాదని భారత్ అబద్ధమాడుతోందని అందులో పేర్కొన్నారు. పాక్ అధికారులు తనను బాగానే చూసుకుంటున్నారన్న విషయం తన తల్లికి అర్థం అయిందని పేర్కొన్నారు. తనను కలిసి బయట అడుగుపెట్టగానే తన తల్లిని భారతీయ అధికారి గద్దించడం చూశానని ఆరోపించారు.

గతంలోలానే పాక్ కుల్‌భూషణ్‌తో బలవంతంగా ఈ అబద్ధాలు ఆడించిందని భారత్ ఆరోపించింది. తల్లిని కలిసినప్పుడు అడ్డుగా గాజు తెరను  పెట్టిందని, అటువంటప్పుడు భారత అధికారి ఒకవేళ అతడి తల్లిపై అరిచి వుంటే ఆ అరుపులు అటువైపు ఉన్న జాదవ్‌కు ఎలా వినిపించాయో పాకిస్థానే చెప్పాలని డిమాండ్ చేసింది. భారత్‌పై దుష్ప్రచారంలో భాగంగానే ఈ వీడియోను విడుదల చేసిందని ఆరోపించింది. తల్లిని కలిసినప్పుడు అతడి శరీరంపై కనిపించిన గాయాలను బట్టే పాక్ ఎంతకు తెగించిందో అర్థమవుతోందని పేర్కొంది.

ఇటువంటి పనులు పాక్‌కు అలవాటేనని, ఈ వీడియోను చూసి తామేమీ ఆశ్చర్యపోలేదని పేర్కొంది. ఇటువంటి ఎత్తుగడలు పాక్‌కు మామూలేనని దుమ్మెత్తిపోసింది. ఇటువంటి చవకబారు ఎత్తులతో నమ్మించలేమన్న సంగతిని పాక్ తెలుసుకుంటే మంచిదని భారత విదేశాంగ ప్రతినిధి రావిష్ కుమార్ హితవు పలికారు.

More Telugu News