Hariyana: పెళ్లి కొడుకును బలితీసుకున్న పెళ్లి సంబరం.. గుండెలను చీల్చేసిన తూటా!

  • సరదాగా సాగుతున్న పెళ్లిలో విషాదం
  • బంధువు కాల్చిన తుపాకి గురితప్పడంతో పెళ్లి కొడుకు మృతి
  • హరియాణాలో ఘటన

వేడుకగా జరుగుతున్న పెళ్లిలో విషాదం చోటు చేసుకుంది. సరదా కాస్తా, పెళ్లి కొడుకునే బలి తీసుకుంది. ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు కాల్చే తుపాకీ గురి తప్పి పెళ్లి కొడుకు గుండెలను చీల్చేసింది. హరియాణాలోని కైథాల్ జిల్లా గుల్హా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన విక్రమ్ (30) స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డాడు. వివాహం కోసం పట్టణానికి వచ్చిన ఆయన శనివారం వివాహం చేసుకున్నాడు.

వరుడు ఎన్నారై కావడంతో పెళ్లి సంబరం అంబరాన్ని అంటింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు డ్యాన్సులతో జోష్‌లో మునిగిపోయారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని చాటుకునేందుకు బంధువుల్లో ఒకరు తుపాకిని గాల్లోకి పలుమార్లు కాల్చాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అతడికి తగలడంతో తుపాకి గురితప్పింది. తూటా నేరుగా వెళ్లి పెళ్లి కొడుకు గుండెలను చీల్చేసింది. వెంటనే అప్రమత్తమైన బంధువులు విక్రమ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News