rajanikanth: ఇప్పుడు రాజకీయాల్లోకి రాకపోతే ద్రోహం చేసినవాడిని అవుతా: రజనీ కాంత్

  • తమిళ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి
  • మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి
  • డబ్బు, పరపతి కోసం రావడం లేదు

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. చెన్నైలో అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డబ్బు కోసమో, పేరు కోసమో తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. కావాల్సినంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే తనకు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రావడం అనవసరమేనని... కానీ రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాలమే దీన్ని నిర్ణయించిందని తెలిపారు.

తమిళనాట రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని చెప్పారు. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో తమిళ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడును చూసి నవ్వుకుంటున్నాయని అన్నారు. ఈ సమయంలో రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాడిగా మిగిలిపోతానని చెప్పారు. తనకు తమిళ ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తెలిపారు.

More Telugu News