online frauds: ఈ ఏడాది 25,800 ఆన్ లైన్ ‘బ్యాంకింగ్’ మోసాలు

  • వీటి మొత్తం విలువ రూ.179 కోట్లు
  • డిసెంబర్ క్వార్టర్లోనే గణనీయంగా మోసాలు
  • మహారాష్ట్రలో ఎక్కువ ఘటనలు

ఎన్ని విధాలుగా పటిష్ట చర్యలు చేపట్టినప్పటికీ దేశ బ్యాంకింగ్ రంగంలో ఆన్ లైన్ మోసాలు జరిగిపోతూనే ఉన్నాయి. 2017లో డిసెంబర్ 21 వరకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ కు సంబంధించి 25,800 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.179 కోట్లు. ఈ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభకు ఈ రోజు తెలియజేశారు. ‘‘ఆర్ బీఐ అందించిన సమాచారం మేరకు... ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ కు సంబంధించి డిసెంబర్ క్వార్టర్లో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) 10,220 కేసులు దాఖలయ్యాయి’’ అని మంత్రి వివరించారు. వీటి విలువ రూ.111.85 కోట్లుగా తెలిపారు.

సెప్టెంబర్ క్వార్టర్లో 7,372 మోసాలు జరగ్గా, జూన్ త్రైమాసికంలో 5,148 కేసులు, మార్చి క్వార్టర్లో 3,077 మోసాలు చోటు చేసుకున్నాయని, వీటి విలువ రూ.67.13 కోట్లు అని మంత్రి తెలిపారు. రూ.లక్ష అంతకంటే ఎక్కువ విలువైన కేసుల విషయంలో మహారాష్ట్ర ముందుంది. ఇక్కడ 2016-17లో 380 ఘటనలు చోటు చేసుకోగా, వీటి విలువ రూ.12.10 కోట్లు. ఆ తర్వాత హర్యానా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి.

More Telugu News