Dinakaran: మౌనవ్రతం పాటిస్తున్న శశికళ... దినకరన్ వెళ్లినా మాట్లాడని చిన్నమ్మ!

  • ఆనందాన్ని అత్తతో పంచుకునేందుకు వెళ్లిన దినకరన్
  • చిరునవ్వులు, కనుసైగలే శశికళ మాటలు
  • డిసెంబర్ 5 నుంచి చిన్నమ్మ మౌనవ్రతం

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను సాధించిన విజయం తరువాత, ఆ ఆనందాన్ని తన అత్తతో పంచుకునేందుకు టీటీవీ దినకరన్, బెంగళూరు లోని జైలుకు వెళ్లి శశికళను కలిసి వచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత తొలి వర్థంతి సందర్భంగా ఆమె నెచ్చెలి శశికళ, బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. డిసెంబర్ 5న జయలలిత తొలి వర్థంతి కాగా, ఆమెకు నివాళిగా నాటి నుంచి ఆమె ఈ వ్రతాన్ని ప్రారంభించారు.

ఇక దినకరన్ తనను కలిసిన వేళ, కేవలం చూపులతోనే పలకరించారని, చిరునవ్వే ఆమె మాటలైనాయని, దాదాపు అరగంట సేపు దినకరన్, తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకుని వచ్చారని ఏఐఏడీఎంకే శశికళ వర్గం సెక్రెటరీ వీ పుహళెంది మీడియాకు వెల్లడించారు. జనవరిలో శశికళ తన మౌనవ్రతాన్ని విరమిస్తారని ఆయన అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడుపుతుండగా, మొత్తం నాలుగేళ్ల శిక్షను అనుభవించాల్సి వుందన్న సంగతి తెలిసిందే.

More Telugu News