Jagityal: రియాద్‌లో గుండెపోటుతో మరణించిన తెలంగాణ వాసి.. మృతదేహాన్ని భారత్‌కు తరలిస్తుండగా ప్రమాదంలో స్నేహితుడు మృతి!

  • 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం రియాద్ వెళ్లిన స్నేహితులు
  • గుండెపోటుతో ఒకరు, రోడ్డు ప్రమాదంలో మరొకరు ఒకే రోజు మృతి
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సౌదీలోని రియాద్‌లో జరిగిన ప్రమాదంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన స్నేహితులు ఒకే రోజు మరణించారు. మెట్‌పల్లికి చెందిన యాకుబ్ అలీ (48), అప్సర్ జానీ (47) స్నేహితులు. ఉపాధి కోసం ఇద్దరూ కలిసి 15 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. రియాద్‌లోని జానీ రెడీమేడ్ వస్త్రవ్యాపారం ప్రారంభించగా అలీ అతడితో ఉంటున్నాడు. బుధవారం యాకుబ్ అలీ గుండెపోటుతో మృతి చెందాడు.

దీంతో అతడి మృతదేహాన్ని స్వగ్రామమైన మెట్‌పల్లికి తరలించేందుకు గురువారం ఉదయం జానీ, అతడి బంధువు యూసుఫ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన యూసుఫ్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. స్నేహితులిద్దరూ ఒకే రోజు మరణించిన విషయం తెలిసి మెట్‌పల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.  

More Telugu News