chota rajan: చోటా రాజన్ హత్యకు దావూద్ కుట్ర.. తీహార్ జైల్లో అలర్ట్!

  • తీహార్ జైల్లోనే అంతం చేసేందుకు పథకం
  • గ్యాంగ్ స్టర్ నీరజ్ భావనతో టచ్ లో ఉన్న డీ గ్యాంగ్ 
  • తాగిన మైకంలో నోరు జారిన నీరజ్ అనుచరుడు

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను తీహార్ జైల్లోనే అంతం చేసేందుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పావులు కదిపాడన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాజన్ హత్యకు పథకం సిద్ధమైందంటూ రెండు వారాల క్రితం తీహార్ జైలు అధికారులను ఇంటెలిజెన్స్ శాఖ హెచ్చరించింది.

ఢిల్లీలో టాప్ గ్యాంగ్ స్టర్ అయిన నీరజ్ భావన సహచరుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. బెయిల్ పై విడుదలైన ఈ వ్యక్తి తాగిన మత్తులో మరొకవ్యక్తితో మాట్లాడుతూ ఈ విషయాన్ని లీక్ చేశాడు. రాజన్ ను తుదముట్టించేందుకు నీరజ్ తో దావూద్ గ్యాంగ్ టచ్ లో ఉన్నట్టు తెలిపాడు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి డీ గ్యాంగ్ తో రాజన్ కు వైరం ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా రాజన్ ను హతమార్చేందుకు డీ గ్యాంగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు.

ఈ క్రమంలో చోటా రాజన్ ఉన్న జైల్లోనే ఉన్న నీరజ్ ను (ఇద్దరూ వేర్వేరు సెల్స్ లో ఉన్నారు) ఇంటెలిజెన్స్ సూచనలతో చీకటి గదికి తరలించారు. ఇలా తరలించడానికి కొన్ని రోజులు ముందు అతని గది నుంచి రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తీహార్ జైలు అధికారులు మాట్లాడుతూ, జైల్లో ఉన్న చోటా రాజన్ ను చేరుకోవడం డీ గ్యాంగ్ కు, నీరజ్ మనుషులకు అసాధ్యమని చెప్పారు. ఇదే సమయంలో రాజన్ కు రక్షణగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక వంటవాళ్లను నియమించారు. అంతేకాదు వీరిపై ప్రత్యేక గార్డ్స్ తో నిఘా ఏర్పాటు చేశారు.

దావూద్ గ్యాంగ్ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండకూడదనే కారణంతోనే... రాజన్ ను ముంబై లేదా మహారాష్ట్ర జైళ్లలో కాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు.

More Telugu News