OLX: ఓఎల్ఎక్స్‌లో కారు అమ్మకానికి పెట్టిన టెకీ అదృశ్యం!

  • పాట్నాకు చెందిన వ్యక్తి బెంగళూరులో అదృశ్యం
  • కారును చూపించేందుకు వెళ్లి తిరిగిరాని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన స్నేహితులు
  • సోషల్ మీడియా ద్వారా వెతుకులాట

ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్‌లో కారు అమ్మకానికి పెట్టిన ఓ టెకీ అదృశ్యమయ్యాడు. గత సోమవారం నుంచి ఆయన కనిపించడం లేదు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌లోని పాట్నాకు చెందిన అజితబ్ కుమార్ (29) ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్‌లో తన కారును అమ్మకానికి పెట్టాడు. ఆ కారును చూసిన ఓ వ్యక్తి అతడికి ఫోన్ చేశాడు.

దీంతో కుమార్ తన కారును చూపించేందుకు ఈనెల 18 సాయంత్రం 6:30 గంటల  ప్రాంతంలో కారులో బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన కుమార్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులు అతడికి ఫోన్ చేశారు. అది స్విచ్చాఫ్‌లో ఉండడంతో కంగారు పడిన వారు వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి ఫోన్ వాట్సాప్ సాయంత్రం 7:10 గంటల వరకు యాక్టివ్‌లోనే ఉన్నట్టు పోలీసులకు తెలిపారు.

2010లో బెంగళూరుకు వచ్చిన అజితబ్ కుమార్ తన చిన్ననాటి స్నేహితుడైన రవితో కలిసి వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఉంటున్నాడు. ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ ప్రోగ్రాం సంపాదించాడని, డిసెంబరు 20 నాటికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందని, బహుశా అందుకోసమే కారును అమ్మకానికి పెట్టినట్టు స్నేహితులు తెలిపారు. రూము నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తానెక్కడికి వెళ్తున్నది చెప్పలేదన్నారు. అజితబ్ కుమార్ ఆచూకీ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా కూడా వెతుకుతున్నారు.

More Telugu News