Videocan: 2జీ కేసు తీర్పు నేపథ్యంలో.. కేంద్రంపై రూ.10 వేల కోట్లకు దావా వేసేందుకు సిద్ధమైన వీడియోకాన్!

  • 2జీ కుంభకోణం ఆరోపణలతో స్పెక్ట్రం లైసెన్స్‌లను రద్దు చేసిన సుప్రీం కోర్టు
  • ప్రభుత్వ  నిర్ణయంతో రూ.25 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్న వీడియోకాన్
  • తాజా తీర్పుతో ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం రాబట్టేందుకు యత్నాలు

ఏళ్లుగా సాగిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో వీడియోకాన్ టెలికంలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ కేసులో తమను అనవసరంగా ఇరికించారని, తమ తప్పులేదని తెలిసినా స్పెక్ట్రమ్ లైసెన్స్‌ను రద్దు చేసినందుకు ప్రతిగా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్లు ఇప్పించాల్సిందిగా త్వరలోనే కోర్టులో కేసు వేసేందుకు రెడీ అవుతోంది.

ప్రభుత్వ నిర్ణయంతో తమకు రూ.10 వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్టు చెబుతున్న వీడియోకాన్ ఇప్పుడు ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రాబట్టాలని యోచిస్తున్నట్టు సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు. తమ తప్పు లేకుండానే రూ.25 వేల కోట్ల వరకు నష్టపోయామని, తాజా తీర్పుతో తమకు బోల్డంత ఊరట లభించిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం నుంచి నష్ట పరిహారాన్ని కోరుతున్నట్టు తెలిపారు.

2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఫిబ్రవరి 2, 2012లో సుప్రీంకోర్టు 122 టెలికం లైసెన్స్‌లను రద్దు చేసింది. వీటిలో వీడియోకాన్‌కు చెందిన 21 లైసెన్స్‌లు ఉన్నాయి. సుప్రీం తీర్పుతో తీవ్రంగా నష్టపోయిన వీడియోకాన్ మే, 2016లో తమ స్పెక్ట్రమ్‌ను భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.4,428 కోట్లకు విక్రయించి టెలికం రంగం నుంచి తప్పుకుంది.

More Telugu News