ipl: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2018.. జ‌న‌వ‌రి 27న‌ వేలం!

  • బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నున్న వేలం
  • అంద‌రి దృష్టి ధోనీపైనే
  • చెన్నై సూప‌ర్‌కింగ్స్ తిరిగి ద‌క్కించుకుంటుందా?

ప్రతిష్ఠాత్మ‌క ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌కి సంబంధించి 2018 ఆట‌గాళ్ల వేలం జ‌న‌వ‌రి 27-28న కొన‌సాగనుంది. రెండ్రోజుల పాటు ఈ ఆట‌గాళ్ల వేలం ప్ర‌క్రియ బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నుంది. ప్ర‌తి ఏడాది ఈ వేలం ప్ర‌క్రియ ఫిబ్ర‌వరిలో జ‌రుగుతుండేది. కానీ ఈసారి కొంచెం ముందుగా జ‌న‌వ‌రిలోనే నిర్వ‌హించ‌నుండడం గ‌మ‌నార్హం. ఈసారి ఫ్రాంచైజీ వేత‌న బ‌డ్జెట్‌ను రూ. 66 కోట్ల నుంచి రూ. 80 కోట్ల‌కు బీసీసీఐ పెంచింది.

ఇక ఈ వేలానికి సంబంధించి అంద‌రి దృష్టి మ‌హేంద్ర సింగ్ ధోనీ మీదే ఉంది. అవినీతి ఆరోప‌ణ‌ల కార‌ణంగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టు ఈ వేలంలో పాల్గొన‌నుంది. అయితే ఈసారి త‌మ జ‌ట్టు మాజీ సార‌ధి ధోనీని తిరిగి సొంతం చేసుకోగ‌లుగుతుందా? లేదా? అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం నుంచి ధోనీ, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుతో ఉన్నారు.

2008 నుంచి 2015 మ‌ధ్య  రెండు సార్లు (2010, 2011) సీఎస్‌కే టైటిల్ సంపాదించింది. అలాగే 2008, 2012, 2013, 2015ల్లో ఫైన‌ల్‌కి చేరుకుంది. ఈ జ‌ట్టుతో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కూడా ఈ వేలంలో పాల్గొననుంది. ఇదిలా ఉండ‌గా, ఐపీఎల్ ప్ర‌సార‌హ‌క్కులను స్టార్ స్పోర్ట్స్ చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. రానున్న ఐదేళ్ల పాటు ఈ లీగ్ ప్ర‌సారాలు వారివే! 

More Telugu News