alcohal: సైబరాబాద్ పరిధిలో రాత్రి 11 గం.ల త‌ర్వాత మ‌ద్యం విక్ర‌యిస్తే చ‌ర్య‌లు!

  • బార్ల‌కు రాత్రి 12గం.ల వ‌రకు అనుమ‌తి
  • నిబంధనలు మూడోసారి ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు 
  • ప్ర‌త్యేక స‌మావేశంలో పోలీసు క‌మిష‌న‌ర్ సందీప్ శాండిల్య‌

సైబరాబాద్ పరిధిలో రాత్రి 11 గంట‌ల త‌ర్వాత మ‌ద్యం విక్రయిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య హెచ్చ‌రించారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న బార్‌లు, పబ్‌ల యాజమాన్యాలతో సీపీ నిన్న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ స‌మావేశంలో మ‌ద్యం వ్యాపారుల‌కు ఆయ‌న కొన్ని సూచ‌న‌లు చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బార్‌లు రాత్రి 12 గంటలు, వైన్స్‌ షాపులు రూ.11 గంటలకు మూసివేయాల్సిందేనని వారికి స్పష్టంచేశారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే నేరం కింద ప‌రిగ‌ణిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే బార్‌లు, పబ్‌లలో రాత్రి 11 గం.ల‌ తర్వాత భోజనానికి సంబంధించిన విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపారు. కాక‌పోతే ఈ విక్ర‌యాలు జ‌ర‌గ‌డానికి యాజమాన్యాల వ‌ద్ద ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీసు నుంచి అనుమతులు తప్పనిసరిగా ఉండాల‌ని సూచించారు.

ఈ నిబంధ‌న‌ల‌ను మొద‌టిసారి ఉల్లంఘించిన వారిని పోలీసు కమిషనర్ లేదా స్థానిక పోలీసు స్టేషన్‌లో హాజరుపరుస్తారు. రెండోసారి కూడా ఉల్లంఘిస్తే కనీసం 3 రోజుల శిక్ష తప్పదని హెచ్చ‌రించారు. ఆ తర్వాత కూడా ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దుకు సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామని తెలిపారు.

More Telugu News