Harish Rao: కంప్యూటరే అభివృద్ధి అని చంద్రబాబు.. రియల్ ఎస్టేటే అభివృద్ధి అని వైఎస్సార్ అన్నారు: హ‌రీశ్ రావు

  • పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ ఫలాలు అందించడమే అభివృద్ధి
  • తాగునీరు, సాగునీరు అందించడమే కేసీఆర్ ల‌క్ష్యం
  • కేసీఆర్ అభివృద్ధి నమూనాకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు
  • నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే పునాది

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభివృద్ధి నమూనాకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయ‌ని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. జ‌న‌గాం జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లోని ఇప్పుగూడెం స‌మీపంలో కోతువాగు మాటు నుంచి ఫీడ‌ర్ ఛాన‌ల్ నాగుల చెరువు వ‌ర‌కు మిష‌న్ కాక‌తీయ ఫేజ్‌-4 ప‌నుల‌కు హ‌రీశ్ రావు ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. అలాగే దొడ్డి కొమ‌ర‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... దొడ్డి కొమరయ్యను కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆయ‌న‌ స్ఫూర్తిగా నిలిచార‌ని, ప్రేరణ ఇచ్చార‌ని తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన అమరత్వమే నాందని అన్నారు. దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం త‌న‌కు చాలా సంతోషం కలిగిస్తుందని చెప్పారు. దేశ్‌ముఖ్ లకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడని అన్నారు. 2001 నుంచి సాగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ ఎంతో మంది బలిదానాలు చేశారని, త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ అంటే అందరికీ ముందుగా యాదికొచ్చేది దొడ్డి కొమరయ్య అని అన్నారు.

జనగామ తాలూకాలో ఆనాడు మొత్తం 60 గ్రామాల్లో విసునూరు దేశ్‌ముఖ్‌దే ఇష్టా రాజ్య‌మ‌ని, దోపిడీ, హింస అని అన్నారు. వారిపై తిరగబడినందుకు దొడ్డి కొమరయ్యను కాల్చి చంపారని తెలిపారు. భూమి కోసం, భుక్తికోసం, వెట్టినుంచి విముక్తి కోసం జరిగిన పోరులో దొడ్డి కొమరయ్య తొలి అమరుడయ్యార‌ని అన్నారు. వెనుకబడిన గొల్ల కులంలో పుట్టిన కొమరయ్య ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని హ‌రీశ్ రావు అన్నారు.

తెలంగాణలో కురుమలు చాలా శక్తిమంతులు

"తెలంగాణలో కురుమలు చాలా శక్తిమంతులు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వారికి కోటిన్నర గొర్రెలను పంపిణీ చేయబోతున్నాం. దేశం మొత్తం మాంసం తయారు చేసి పంపే విధంగా తెలంగాణ కురుమలు అభివృద్ధి చెందాలి. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి ప్రాధాన్యతలు వేరు. కంప్యూటరే అభివృద్ధి అని చంద్రబాబు అన్నారు. రియల్ ఎస్టేట్ రంగమే అభివృద్ధి అని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ ఫలాలు అందించడం, తాగునీరు, సాగునీరు అందించడమే కేసీఆర్ అభివృద్ధి నమూనా. దేశమంతా కేసీఆర్ అభివృద్ధి నమూనాను ప్రశంసిస్తున్నది.

 ఆకలి లేని, ఆత్మహత్యలు లేని, ఆకు పచ్చ తెలంగాణ నిర్మాణం కేసీఆర్ లక్ష్యం. పేదప్రజల కోసం నిరంతరం ఆయన తపన పడుతున్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వాళ్లు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ఏర్పాటును అప్పుడు వ్యతిరేకించిన  ఇతర శక్తులతో కాంగ్రెస్  చేతులు కలిపింది. ఆ శక్తులే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారు" అని హ‌రీశ్ రావు అన్నారు.

కోదండరాం వైఖరి సరైనది కాదు..
"జేఏసీ చైర్మన్ కోదండరాం వైఖరి సరైనది కాదు. తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటవుతున్నారు. సాగరహారం, మిలియన్ మార్చ్ లో పాల్గొన్నదెవరు? లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డిన దేవరు? శాశ్వతంగా రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయడానికి సాగునీటి ప్రాజెక్టులకు కేసీఆర్ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతుంటే తప్పుడు కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారు" అని హ‌రీశ్ రావు మండిప‌డ్డారు.

More Telugu News