Boeing 747: ఆకాశయానంలో దశాబ్దాల చరిత కలిగిన 'బోయింగ్' ఇక చరిత్రలోకి!

  • ఐదు దశాబ్దాల సేవలకు రేపటితో చెక్
  • బోయింగ్ 747లో 600 మంది ప్రయాణించే వీలు
  • 1969లో తొలిసారి అందుబాటులోకి బోయింగ్ సేవలు

సుమారు ఐదు దశాబ్దాల పాటు అమెరికాలో సేవలందించిన బోయింగ్ 747 విమానం ఇక చరిత్రలో కలిసిపోనుంది. మంగళవారం ఈ విమానం తన చివరి ప్రయాణాన్ని ముగించి శాశ్వతంగా విశ్రాంతి తీసుకోనుంది. జెంబో జెట్‌గా పిలిచే ఈ విమానం అంటే అమెరికా అధ్యక్షులకు కూడా ఎంతో ఇష్టం. విశాలంగా ఉండి, అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో సేవలు ప్రారంభించింది. ఆకాశయానంలో వినూత్న మార్పులు తీసుకొచ్చింది. 1969లో తొలిసారి బోయింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒకేసారి 600 మంది ప్రయాణించే వీలుంది. ఇప్పటి వరకు 1500 బోయింగ్ 747 విమానాలు తయారుకాగా, వాటిలో 500 వరకు ఇంకా సేవలు అందిస్తున్నాయి.

మంగళవారంతో విమానయానానికి బోయింగ్ 747 స్వస్తి చెప్పనుండడంతో చివరిసారిగా ఈ విమానంలో ప్రయాణించాలని ఔత్సాహికులు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే మోడళ్లవైపు దృష్టి పెట్టిన కారణంగా ఈ విమానానికి వీడ్కోలు పలుకుతున్నారు. కాగా, బోయింగ్‌కు అమెరికా మాత్రమే విశ్రాంతి ఇస్తుండగా ప్రముఖ విమానయాన సంస్థలైన లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, కొరియన్ ఎయిర్‌వేస్‌లు వీటిని ఇంకా కొనసాగిస్తున్నాయి.

More Telugu News