నవీన్ నిశ్చల్: స్వతహాగా బ్రాహ్మణులు, వైశ్యులు టీడీపీ వైపు మొగ్గు చూపుతారు.!: వైసీపీ నేత నవీన్ నిశ్చల్

  • డబ్బు కోసం వైశ్యులను బెదిరించాననేది అబద్ధం  
  • బ్రాహ్మణ, వైశ్య కమ్యూనిటీ వాళ్లకు ఓటు వేయాలనే ఆసక్తి ఉండదు
  • బ్రాహ్మణులు, వైశ్యులు టీడీపీ వైపు మొగ్గు చూపుతారు

హిందూపురంలో వైశ్యులను బెదిరించి, తాను డబ్బులు వసూలు చేశాననే మాటలు అబద్ధం అని హిందూపురం వైసీపీ నేత నవీన్ నిశ్చల్ అన్నారు. ‘ఐడ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నా..ఆ విషయం కనుక నిరూపిస్తే, రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. నాకు తెలిసి బ్రాహ్మణ, వైశ్య కమ్యూనిటీల వాళ్లకు పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటు వేసే ఆసక్తి ఉండదు. వాళ్లకు సెలవు కనుక వస్తే, పక్కనే ఉన్న బెంగళూరు వెళ్లి రెస్ట్ తీసుకుందాం, షాపింగ్ చేసుకుందామనే ఆలోచన తప్పా వేరే ఆలోచన ఉండదు.

వైశ్యులు వ్యాపార పరంగా 365 రోజులు బిజీగా ఉంటారు. బంద్ లు, ప్రభుత్వ సెలవులు లేదా మరో రకంగా సెలవులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ల దుకాణాలను బంద్ చేసే అవకాశం ఉంటుంది. హిందూపురంలో వైశ్యులను బెదిరించడం వల్ల వాళ్లు నాకు ఓట్లు వేయలేదనే మాట అబద్ధం. ఎందుకంటే, స్వతహాగా బ్రాహ్మణులు, వైశ్యులు టీడీపీ వైపు మొగ్గు చూపుతారు. నన్ను ఇబ్బంది పెట్టాలనే విధంగా నా శత్రువుల ఆలోచనలు ఉన్నాయి. నవీన్ ని ఏ రకంగా జీరో చేయాలి.. నన్ను ఏదో ఒక విధంగా జీరోను చేసి, వాళ్లు హీరోలు కావాలని ఆలోచిస్తున్నారే తప్పా, ప్రజా సమస్యల కోసం పోరాడటం, మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన వాళ్లకు లేవు’ అని మండిపడ్డారు.

More Telugu News