నవీన్ నిశ్చల్: అందుకే, నేను మూడుసార్లు ఓడిపోయాను: నవీన్ నిశ్చల్

  • చిల్లర రాజకీయాలు చేయలేకపోవడం వల్లనే ఓడిపోయా 
  • వ్యక్తిత్వాన్ని చంపుకుని గెలిచే గెలుపు నాకు అవసరం లేదు
  • కులసంఘాన్ని అడ్డంపెట్టుకుని నేను ఈ స్థాయికి రాలేదు
  • వైసీపీ నేత నవీన్ నిశ్చల్

వ్యక్తిత్వాన్ని చంపుకుని గెలిచే గెలుపు తనకు అవసరం లేదని, లొంగిపోయే తత్త్వం తనకు లేదు కనుకనే గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని హిందూపురం వైసీపీ నేత నవీన్ నిశ్చల్ అన్నారు. ‘ఐడ్రీమ్ ఇంటర్వ్యూ’లో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చు కానీ, ఈరోజున హిందూపురంలో ఏ రోడ్డులో చూసినా కూడా నేను నాటిన చెట్లే ఉంటాయి. ఇలాంటి పని చేయాలంటే మనం అధికారంలోనే ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు.

కేవలం నా కులానికి చెందిన వాళ్లే నాకు ఓట్లు వేస్తే సరిపోదు. కులసంఘాన్ని అడ్డంపెట్టుకుని నేను ఈ స్థాయికి రాలేదు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున రాజకీయాల నుంచి నేను పక్కకు తప్పుకుంటాను. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను ఓడిపోవడానికి కారణం వెన్నుపోటు. 2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. దీంతో, ఇండిపెండెంట్ గా పోటీ చేశాను కానీ, ఓడిపోయాను. 2014లోనూ ఓటమి చవిచూశాను. అయితే, చిల్లర రాజకీయాలు చేయలేకపోవడం వల్లనే ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. భగవంతుడు నాకు ఒకసారి అవకాశమిస్తే.. ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిస్తే ఇరవైఏళ్ల పాటు ఇంకెవరికి అవకాశమివ్వనన్నది నా ధీమా’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News