Jayant Sinha: గూగుల్, ఫేస్‌బుక్, అలీబాబాను మనమే తయారుచేసుకుందాం..కేంద్రమంత్రి జయంత్ సిన్హా

  • మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనమే వాటిని సృష్టించుకోవాలి
  • మన విజయ గాథలను మనమే రాసుకోవాలి
  • భారత పారిశ్రామికవేత్తలకు కేంద్రమంత్రి పిలుపు

మన సమస్యలను పరిష్కరించుకోవాలంటే మనమూ ఓ గూగుల్, ఓ ఫేస్‌బుక్, ఓ అలీబాబాను తయారుచేసుకోవాలని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఈ మేరకు భారత పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. గ్లోబల్ దిగ్గజాలైన గూగుల్, అలీబాబాలా మనమూ మన విజయగాథలను లిఖించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘మనం మన దేశ సమస్యలను పరిష్కరించుకోగలిగితే ప్రపంచ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు. అంతేకాదు మన సొంత సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతాం’’ అని సిన్హా పేర్కొన్నారు. పనాజీలో నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్ కాన్‌క్లేవ్ 2017’లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత పారిశ్రామికవేత్తలు దేశీయ అవసరాలు తీర్చేలా ఉత్పత్తులు ప్రారంభించి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. మన ప్రజల కోసం మనం తయారుచేసుకునే వస్తువులు, సేవలు ఇతర ప్రాంతాల్లోనూ ఉపయోగంలోకి వస్తాయన్నారు.

21వ శతాబ్దంలో మనం లీడర్ కావాలంటే దేశం ‘వ్యవస్థాపక ఇంజిన్’ కావాలని మంత్రి పేర్కొన్నారు. పలు రంగాల్లో భారత్ ఇప్పటికే సత్తా చాటిందని పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే అతి చవగ్గా టెలికం సేవలు అందిస్తోందని, ప్రపంచంలోని మరే దేశమూ వినియోగించనంత డేటాను ఉపయోగిస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పుడు మనం చేయాల్సింది గూగుల్, ఫేస్‌బుక్, అలీబాబా, టెన్సెంట్‌లను క్రియేట్ చేయడమేనని సిన్హా పిలుపునిచ్చారు.

More Telugu News