Chiranjeevi: పసుపులేటికి అప్పట్లో నేను రూ.100 ఇవ్వబోతే తీసుకోలేదు!: పాత్రికేయుని నిజాయతీని కొనియాడిన చిరంజీవి

  • దాసరి నారాయణరావు జీవితంపై సీనియర్‌ పాత్రికేయుడు పసుపులేటి పుస్త‌కం
  • చిరంజీవి చేతుల మీదుగా ‘తెర వెనుక దాసరి’ పుస్తకం విడుద‌ల‌
  • గ‌తంలో త‌న గురించి ఆర్టిక‌ల్ రాశార‌ని వ్యాఖ్య

దివంగ‌త దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితంపై సీనియర్‌ పాత్రికేయుడు పసుపులేటి రామారావు పుస్త‌కాన్ని రాశారు. ‘తెర వెనుక దాసరి’ పేరుతో రాసిన ఈ పుస్త‌కాన్ని నిన్న రాత్రి మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... సినీ ప‌రిశ్ర‌మ‌కు దాసరి నారాయ‌ణ రావు చేసిన సేవను కొనియాడారు. సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాల‌నుకునేవారు ఈ పుస్తకాన్ని చ‌దివితే స్ఫూర్తి పొందుతార‌ని చెప్పారు.

ఈ పుస్త‌కాన్ని ర‌చించిన‌ పాత్రికేయుడు పసుపులేటి రామారావు గురించి చిరు మాట్లాడుతూ.. తాను ఆర్టిస్టుగా వచ్చిన తొలి నాళ్లలో ప‌సుపులేటి త‌న గురించి ఓ ఆర్టిక‌ల్ రాశార‌ని, ఆయ‌న‌ను ప్రశంసిస్తూ రూ.100 ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని, అయితే ఆ ప్రోత్సాహ‌కాన్ని ఆయ‌న‌ సున్నితంగా తిరస్కరించారని అన్నారు. ఆర్టిక‌ల్స్ రాయ‌డం త‌న బాధ్య‌త‌ని అప్పుడాయన చెప్పార‌ని తెలిపారు. ప‌సుపులేటి మట్టిలో మాణిక్యం లాంటి వ్య‌క్త‌ని చిరంజీవి అన్నారు. త‌న‌కు ప‌సుపులేటి చాలా కాలం నుంచి తెలుస‌ని, ఆయన చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి అని అన్నారు.

More Telugu News