YSRCP: వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిపై కోడిగుడ్ల దాడి.. గిద్దలూరులో ఘటన!

  • ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యేపై గుడ్లు విసిరిన యువకులు
  • పట్టుకుని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు
  • ఎవరినీ అరెస్ట్ చేయలేదన్న పోలీసులు

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డిపై కొందరు కోడిగుడ్లతో దాడిచేశారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతున్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేశారు.

గుడ్ల దాడితో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. గుడ్లు విసిరినట్టు అనుమానిస్తున్న కొందరు యువకులను ఎమ్మెల్యే అనుచరులు పట్టుకుని చేయిచేసుకున్నారు. అలాగే కోడిగుడ్లు విసిరారన్న అనుమానంతో గ్రామ సర్పంచ్ బంధువులు నలుగురు యువకులపై దాడి చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం మద్యం మత్తులో యువకులు పరస్పరం కోడిగుడ్లు విసురుకున్నారని, తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

More Telugu News