Uttar Pradesh: సాయం చేయాలని బాధితురాలు కోరితే... యూపీలో ఘోరాతిఘోరం!

  • లక్నోలో ఘటన
  • క్యాన్సర్ సోకిన బాలికపై ఇద్దరి దుర్మార్గం
  • కదల్లేని స్థితిలో సాయం కోరిన బాలిక
  • సాయపడటం మాని మరోసారి అత్యాచారం

సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఇది. యూపీ రాజధాని లక్నోకు సమీపంలోని సరోజినీ నగర్ ప్రాంతంలో 15 సంవత్సరాల క్యాన్సర్ సోకిన బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడగా, కదల్లేని పరిస్థితిలో ఓ దారిన పోయే వ్యక్తిని సాయం కోరిన వేళ, నిస్సిగ్గుగా అతను కూడా దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి ఎక్కి కలకలం రేపుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటికి అవసరమైన సరుకులను కొనుగోలు చేసేందుకు బాధితురాలు బయటకు వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది. ఆమెను గమనించిన సుమిత్, అతని స్నేహితుడు వీరేంద్రలు అటకాయించి, నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమె, అదే దారిలో వెళుతున్న శుభమ్ అనే వ్యక్తిని సాయం కోరగా, అతను కూడా కోరిక తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును తీవ్రంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే సుమిత్, వీరేంద్రలను అరెస్ట్ చేశామని, తప్పించుకున్న శుభమ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో యూపీలో అత్యాచారాలు, ముఖ్యంగా చిన్నారులపై దౌర్జన్యాలు గణనీయంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News