Swathi: స్వాతి ఇంత కిరాతకురాలిగా మారడానికి కారణమిదే!

  • ఒంటరితనం, డాక్టర్ పై వ్యామోహం
  • స్వాతిని కిరాతకురాలిగా మార్చిన టీవీ సీరియల్స్
  • వారం రోజుల డ్రామాకు తెర

తరచూ వ్యాపార పనుల నిమిత్తం భర్త బయటకు వెళుతుంటే, ఇంట్లో ఒంటరితనం, టీవీ సీరియల్స్ చూస్తూ తలకెక్కించుకున్న పైత్యం, తనకు దగ్గరైన కుర్ర డాక్టర్ పై వ్యామోహం కలిసి, నాగర్ కర్నూలులో మంద స్వాతిని కిరాతకురాలిగా మార్చి కటకటాల వెనక్కు నెట్టాయి. యాసిడ్ దాడి కేసు విచారణలో భాగంగా ఇప్పటికే స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ ల నుంచి నిజాన్ని కక్కించిన పోలీసులు, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించారు.

ఇంట్లో ఒంటరిగా ఉండే స్వాతికి రాజేష్ దగ్గర కాగా, ఆ విషయం భర్త సుధాకర్ కు తెలిసి, వారిద్దరి మధ్యా గొడవ జరిగిందని, ఈ గొడవలో సుధాకర్ తలకు గాయం కాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడని చెప్పిన పోలీసు అధికారులు, ఆ సమయంలోనే స్వాతి, ఆమె ప్రియుడు కలిసి సుధాకర్ ను అంతం చేయాలని మాస్టర్ ప్లాన్ వేశారని తెలిపారు.

నిద్రిస్తున్న సుధాకర్ మెడకు మత్తు ఇంజక్షన్ ను ఇచ్చిన రాజేష్, తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపారని, ఆపై శవాన్ని తీసుకెళ్లి దహనం చేసి, యాసిడ్ దాడి నాటకం మొదలు పెట్టారని తెలిపారు. ఓ సీరియల్ లో చూపించిన విధంగా ప్లాస్టిక్ సర్జరీతో తన భర్త రూపురేఖలు మార్చాలన్న స్వాతి ఆలోచన ఆమెను ఈ పని చేసేందుకు ప్రోత్సహించిందని అన్నారు.

తన ముఖానికి పెద్దగా గాయాలు కారాదని, నల్లగా మారితే ఇక ఎవరూ గుర్తు పట్టరని భావించిన రాజేష్, ఓ టవల్ ను ముఖంపై చుట్టుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని యాసిడ్ దాడి నాటకం ఆడారని పోలీసులు తెలిపారు. ఈ నాటకం వారం రోజుల పాటు సాగిందని, ముఖానికి గాయాలు మానాయని చెబుతూ, ముఖంపై ఉన్న కట్టు తీసిన తరువాతే అతను సుధాకర్ కాదని బంధువులకు తెలిసిందని, ఆపైనే మొత్తం స్టోరీ బయటకు వచ్చిందని వెల్లడించారు.

More Telugu News