Guntur Dist: పదమూడేళ్లకే పెళ్లి... మత్తిచ్చి పడక గదిలోకి... పిడుగురాళ్లలో ఘోరం!

  • 35 ఏళ్ల యువకుడితో రహస్య వివాహం
  • విషయం చెప్పవద్దని నిత్యమూ చిత్రహింసలు
  • మేనత్త దాష్టీకానికి బలైన బాలిక

పెంచుకుంటామని నమ్మబలుకుతూ, ఓ 13 ఏళ్ల బాలికను తీసుకెళ్లిన మేనత్త, 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి రహస్యంగా పెళ్లి జరిపించడంతో, పాటు నిద్ర మాత్రలు ఇచ్చి, శోభనానికి పంపి, తన రాక్షసత్వాన్ని చాటుకుంది. గుంటూరు జిల్లాల పిడుగురాళ్లలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల కుమార్తెను వెంకయ్య సోదరి నాగలక్ష్మి పెంచుకుంటోంది. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న బాలికకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని, కందుకూరు తీసుకెళ్లి, రహస్యంగా మాలకొండ స్వామి గుడిలో 35 ఏళ్ల మనోజ్ తో తాళి కట్టించారు.

తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా పని పూర్తి చేసిన నాగలక్ష్మి, మత్తు మందిచ్చి పడక గదిలోకి పంపించింది. మెలకువ వచ్చిన తరువాత, "భయంగా ఉంది, తలుపులు తెరవండి" అని ఆమె మొత్తుకున్నా వదిలిపెట్టలేదు. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బాలికను చిత్ర హింసలు పెట్టారు. పెళ్లి గత నెల 25న జరుగగా, అప్పటి నుంచి విషయం ఎవరికీ చెప్పవద్దని రోజూ హింసిస్తున్నారు. బిడ్డను చూసి పోదామని తల్లి వచ్చేంత వరకూ వారి దాష్టీకం సాగింది. పాప ఒంటిపై గాయాలు చూసి బోరుమన్న పార్వతి, తన బిడ్డ గొంతు కోశారని ఆరోపించింది. ఆధార్ కార్డులో వయసు 13 ఏళ్లని ఉండగా, దాన్ని 20కి మార్చి ఈ పెళ్లిని జరిపించారని ఆరోపించింది. ఈ విషయంలో పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు.

More Telugu News