Chiranjeevi: చిరంజీవి ఇంటి వద్ద హడావిడి చేసిన మహిళ... కంగారుపడి పోలీసులను పిలిచిన సెక్యూరిటీ!

  • చిరంజీవి తెలుసంటూ వచ్చిన తుని మహిళ
  • రాత్రంతా ఇంటిముందు పడిగాపులు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

తనకు చిరంజీవి తెలుసునని, తానొచ్చానని ఆయనకు చెబితే గుర్తు పడతారని చెబుతూ, హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటి ముందు హల్ చల్ చేసిన శ్రీదేవి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్రీదేవి (40), అర్ధరాత్రి దాటిన తరువాత చిరంజీవి ఇంటి వద్దకు వచ్చింది. అక్కడే కూర్చుంది.

ఉదయం ఆమెను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఎవరు కావాలని అడగ్గా, "చిరంజీవి నాకు బాగా తెలుసు. ఆయనకు శ్రీదేవి వచ్చిందని చెప్పండి. దేవీ వచ్చిందని చెప్పినా చాలు. గుర్తు పడతారు" అని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లాలని చెప్పినా వినకుండా కూర్చుండిపోయింది. దీంతో కంగారుపడిన సెక్యూరిటీ, ఇదేదో తేడా కేసులా ఉందనుకుంటూ, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆపై హైదరాబాద్ లోనే ఆమె సోదరి ఉందని తెలుసుకుని, ఆమెకు అప్పగించారు. మరోసారి ఇలా చేయబోనని, ఆమెను బయటకు వదలబోమని కుటుంబ సభ్యులతో హామీ పత్రం రాయించుకున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News