Pawan Kalyan: 'మోదీ డౌన్ డౌన్' అని నేను చెప్పానా?: కార్యకర్తలను వారించిన పవన్ కల్యాణ్

  • పవన్ ప్రసంగంలో మోదీ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తల నినాదాలు
  • తప్పని వారించిన పవన్
  • స్పెషల్ స్టేటస్ బాధ్యతను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తీసుకోవాలి

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, మాట తప్పిన ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చి, మాట తప్పారంటూ మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్ పై పోరాటానికి కూడా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఉద్రేకభరితమైన ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు 'మోదీ డౌన్ డౌన్... పీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. వెంటనే కల్పించుకున్న పవన్... "డౌన్ డౌన్ అని నేను చెప్పానా? ఎవరినీ తక్కువ చేయవద్దు" అంటూ సూచించారు. అది చాలా తప్పు అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ ఎంత బాధ్యత వహించాలో... ప్రతిపక్ష వైసీపీ కూడా అంతే బాధ్యతను స్వీకరించాలని పవన్ చెప్పారు. ఏపీలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కూడా అంతే బాధ్యత ఉందని అన్నారు. రాష్ట్రం కోసం వారు వారి వంతు ప్రయత్నాలను పూర్తి స్థాయిలో చేయాలని చెప్పారు.

More Telugu News