Bunny Vasu: బన్నీ వాసుకు మరోసారి కోపం వచ్చింది.. ఈసారి రజనీకాంత్ సినిమా విడుదలపై!

  • ఇటీవలే నంది అవార్డులపై వాసు విమర్శలు
  • తాజాగా '2.0' విడుదలపై ఆగ్రహం 
  • ఏప్రిల్ 27న విడుదల చేస్తామన్న లైకా ప్రొడక్షన్స్
  • అదే రోజు భరత్ అనే నేను, నా పేరు సూర్య
  • పదేపదే విడుదల తేదీ మార్చడమేంటన్న బన్నీ వాసు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో ఎంతో మందికి అన్యాయం జరిగిందని ఇటీవల విమర్శలు గుప్పించిన బన్నీ వాసు, ఈ దఫా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. రజనీకాంత్ '2.0' చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్టు లైకా ప్రొడక్షన్స్ చేసిన ప్రకటనపై మండిపడ్డాడు. రజనీ సినిమాను తాను గౌరవిస్తానని, అయితే, పదేపదే చిత్రం విడుదల తేదీని మారుస్తూ పోవడం వల్ల చిన్న సినిమాలపై ఆ ప్రభావం పడుతోందని విమర్శించాడు.

కాగా, ఏప్రిల్ 27న బన్నీ వాసు నిర్మిస్తున్న 'నా పేరు సూర్య' విడుదలకు సిద్ధం కాగా, అదే రోజు దానయ్య నిర్మిస్తున్న 'భరత్ అనే నేను' విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీ వాసు, దానయ్యల మధ్య ఎవరో ఒకరు సర్దుకునే దిశగా చర్చలు సాగుతుండగా, తాజాగా లైకా ప్రొడక్షన్స్ సైతం రంగంలోకి దిగడంతో బన్నీ వాసుకు కోపం వచ్చింది.

ఈ వ్యవహారాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌, ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన ఆయన, రిలీజ్ డేట్‌కు తాము కట్టుబడి ఉన్నామని, లైకా ప్రొడక్షన్స్ మాట మార్చరాదని ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News