kapu reservations: కాపు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు!

  • కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేయనున్న అసెంబ్లీ
  • తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం
  • కాపు రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరగదన్న అచ్చెన్న

కాపులకు రిజర్వేషన్లను కల్పించే బిల్లును ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిపిన అనంతరం, తీర్మానం చేసి, దాన్ని కేంద్రానికి పంపించనున్నారు. కాపులను బీసీల్లో చేర్చి, 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలంటూ జస్టిస్ మంజునాథ కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం సభలో దీనిపై చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. కాపులను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించేందుకు కొంత మంది యత్నించారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే టీడీపీకి భగవద్గీత వంటిదని అన్నారు. కాపులకు కల్పించే రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరగదని చెప్పారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో కాపులు బీసీల్లోనే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాపులను బీసీ జాబితా నుంచి తొలగించారని చెప్పారు. 

More Telugu News