Tollywood: ఇవాంకాతో శభాష్ అనిపించుకున్న నటుడు చంద్రమోహన్ కుమార్తె!

  • ఆహూతులను కట్టిపడేసిన మాధవి నృత్యం
  • ఇవాంకా వన్స్ మోర్ అనడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్న చంద్రమోహన్ తనయ
  • కరతాళ ధ్వనులతో మార్మోగిన వేదిక

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కుమార్తె మాధవి చేసిన నృత్యానికి ఇవాంకా ట్రంప్ ముగ్ధురాలయ్యారు. ‘వన్స్‌మోర్’ అంటూ ఉత్సాహపరిచారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన ఇవాంకాకు హైదరాబాద్‌లోని చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముందు కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మణిపురి వంటి సంప్రదాయ నాట్యాలన్నింటినీ కలిపి ఓ నృత్య సమ్మేళనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో నటుడు చంద్రమోహన్, ప్రముఖ రచయిత్రి జలంధరల కుమార్తె అయిన మాధవి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అదరహో అనిపించింది. నృత్య కార్యక్రమం కోసం పన్నెండు రోజుల కిందటే తమ గురువు డాక్టర్ సత్యప్రియ రమణిని కేంద్రం ఆహ్వానించినట్టు ప్రదర్శన అనంతరం మాధవి తెలిపారు.

సమయం తక్కువగా ఉండడంతో రేయింబవళ్లు సాధన చేసినట్టు చెప్పారు. కాగా, మాధవి ప్రదర్శన ముగిసిన వెంటనే వేదిక కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఇవాంకా సహా విందుకు హాజరైన ప్రతి ఒక్కరు ‘వన్స్ మోర్’ అనడం తానెప్పటికీ మర్చిపోలేనని మాధవి తెలిపారు. ఓ కళాకారిణిగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశారు.

More Telugu News