Narendra Modi: కాంగ్రెస్ పార్టీకి నా మనవి ఇదొక్కటే!: నరేంద్ర మోదీ

  • నా పేదరికాన్ని హేళన చేయవద్దు
  • నేను టీ అమ్మిన మాట నిజమే
  • తన గత జీవితం కాంగ్రెస్ కు నచ్చడం లేదన్న మోదీ

ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా రెండు వారాల అలుపెరగని పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శల బాణాలు సంధించారు. "నా పేద గత జీవితం కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదు. అందుకే దిగజారి మాట్లాడుతున్నారు. అవును. ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని అయ్యాడు. అది దాచలేని నిజం. నా పేదరికాన్ని, గత జీవితాన్ని హేళన చేయవద్దని కాంగ్రెస్ పార్టీకి మనవి చేస్తున్నా" అని ప్రధాని అన్నారు.

 ప్రధానిని చాయ్ వాలా అని గత వారంలో కాంగ్రెస్ నేతలు విమర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం రానుందని, ఎన్నో ఏళ్లుగా గుజరాత్ ను అభివృద్ధి చేస్తున్న బీజేపీకి మరో అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లను మోదీ అభ్యర్థించారు. కాగా, 2014 ఎన్నికల్లో 'చాయ్ వాలా' ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందన్న సంగతి తెలిసిందే. మోదీ తన బాల్యంలో రైల్వే స్టేషన్లలో టీ అమ్మాడన్న వ్యాఖ్యలు, ఆయన పేదరికం నుంచి స్వయంగా ఎదిగిన నేతగా ప్రజల్లో పాప్యులారిటీని పెంచాయి.

More Telugu News