jawan: అభిమానులకు శుభవార్త... రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ల ప్రాజక్టు గురించి చెప్పేసిన సాయి ధరమ్ తేజ్!

  • నవంబర్ 18న ఫేస్ బుక్ లో ఫొటో పోస్టు చేసిన రాజమౌళి
  • తరువాత ఊహాగానాలతో వార్తలే వార్తలు
  • ఆ ఫోటో వెనుక సీక్రెట్ చెప్పిన సాయి ధరమ్ తేజ్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ఫేస్ బుక్ లో నవంబర్ 18న పోస్టు చేసిన ఫొటో టాలీవుడ్ లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోపై వివిధ రకాల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈ ముగ్గుర్లో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. ఈ క్రమంలో ఈ ఫొటో వెనుక సీక్రెట్ ను మెగాహీరో సాయి ధరమ్ తేజ్ 'జవాన్' ప్రమోషన్ లో బయటపెట్టాడు.

"ముందు అది చూసి, వాళ్లు ముగ్గురూ కలిసినప్పుడు సరదాగా తీసుకున్న ఫొటోనే అనుకున్నా. అయితే ఆ తరువాత నా స్నేహితుడు ఫోన్ చేసి ఆ ఫొటో చూశావా? అని అడిగాడు. చూశానన్నాను.. ఏదో ఫంక్షన్‌ లో మీట్ అయినట్టున్నారు, అప్పుడు తీసుకున్నట్టున్నారు.. అన్నాను. వెంటనే వాడు కల్పించుకుని 'లేదురా అబ్బాయ్.. ప్రాజెక్ట్ అంట' అని చెప్పడంతో ఉత్కంఠ ఆపుకోలేక, వెంటనే ఫోన్ చేశాను. దీంతో అటునుంచి సమాధానం విని చాలా ఎగ్జయిట్ అయ్యాను. అసలు ఊహించలేదు.

ఎందుకంటే, గొప్ప దర్శకుడు టాలీవుడ్ లోని ఇద్దరు బిగ్ స్టార్ లతో సినిమా చేయడం అంటే ఊహించగలమా? దీంతో రియల్లీ చాలా ఎగ్జయిట్ అయ్యా. ఇక వారు సినిమా చేస్తున్నారని నిర్ధారించుకోవడంతో ఆనందించాను" అంటూ మొట్టమొదటిసారి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ మల్టీస్టారర్‌ పై సాయి ధరమ్ తేజ్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

More Telugu News