Bangalore: బెంగళూరులో కీచక పర్వం.. ఇళ్లలోకి ప్రవేశించి సామూహిక అత్యాచారాలు!

  • ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం
  • ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే టార్గెట్ 
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

బెంగళూరులో కీచకులు రెచ్చిపోయారు. ఇళ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ నెల 16న నగర శివారులోని నెలమంగళకు సమీపంలో ఉండే మాదనాయకహళ్లికి చెందిన కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. ఆమె భర్త బయటకు వెళ్లిన విషయాన్ని గ్రహించిన రాజగోపాల్ నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రాఘవేంద్ర అలియాస్ కుమార్ (32), లగ్గెరెకు చెందిన పునీత్ (22), లక్ష్మీపురానికి చెందిన వెంకటేశ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి ఆమె ఇంట్లోకి ప్రవేశించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

తాజాగా శుక్రవారం రాత్రి నేపాల్ యువతిపై ఆరుగురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న పాడుబడిన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి  పాల్పడ్డారు. అనంతరం ఆమె కాళ్లు కదపకుండా పెద్ద బండరాయిని ఉంచి పరారయ్యారు. ఉదయం ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, రాఘవేంద్రపై హత్య, హత్యాయత్నం, దోపిడీలకు సంబంధించి పది కేసులు ఉన్నాయి.

More Telugu News