modi: గుజరాతీల మనసు చూరగొనేందుకు మోదీ, రాహుల్ ప్రయత్నాలు.. ప్రచారంపై దృష్టి!

ఒకరు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని అవకముందు గుజరాత్ రాష్ట్రాన్ని 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించిన తిరుగులేని నేత. మరొకరు కాంగ్రెస్ పార్టీకి అతి త్వరలోనే అధ్యక్షుడు కానున్న, ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ. వీరిద్దరికీ వచ్చే నెల జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ముఖ్యంగా రాహుల్ కంటే మోదీకి గుజరాత్ ఎన్నికలు చాలా కీలకం. ఇక్కడ గెలిచి తీరాల్సిన పరిస్థితి.

ఎందుకంటే రెండు దశాబ్దాలుగా బీజేపీ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. మోదీ ప్రధానిగా వెళ్లిన తర్వాత గుజరాతీల్లో బీజేపీ పాలన పట్ల కొంత వ్యతిరేకత మొదలైంది. అందుకే ఇప్పుడు అక్కడ గెలిచి తీరడం బీజేపీకి అవసరం. మరోపక్క, దేశంలోని చాలా రాష్ట్రాల్లో మోదీ హవాకు బక్కచిక్కిపోయిన కాంగ్రెస్ కు జీవం నింపేందుకు రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఆ పార్టీకి కొండంత బలం వస్తుంది. అందుకే రాహుల్ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకునే వ్యూహంతో కాంగ్రెస్ ఉంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో నాలుగు పర్యాయాలు ప్రచారం నిర్వహించగా, శుక్రవారం మరోసారి ప్రచారానికి సిద్ధమైపోయారు. శుక్ర, శనివారాల్లో ఆయన ప్రచారం కొనసాగుతుంది. ఇక ప్రధాని మోదీ సైతం సోమవారం నుంచి గుజరాత్ లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. 27, 29వ తేదీల్లో 8 ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 89 స్థానాలకు వచ్చే నెల 9న ఎన్నికలు జరగనుండగా, మోదీ ప్రచారం ఈ నియోజకవర్గాల పరిధిలోనే కొనసాగనుంది.

More Telugu News