Singer: 'ఇవాంకా ఇటు వైపు కూడా వస్తే బాగుండును..' అంటున్న గాయని సునీత!

  • ఇవాంకా పర్యటించే ప్రాంతాల్లో మెరిసిపోతున్న రోడ్లు
  • కొత్తందాలు సంతరించుకుంటున్న భాగ్యనగరం
  • రాయదుర్గం-ఖాజాగూడ రూట్లో ఆమె పర్యటిస్తే బాగుండునంటూ సునీత్ పోస్ట్

మరో ఐదు రోజుల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న ఇవాంకా ట్రంప్ కోసం నగరం అందంగా ముస్తాబవుతోంది. గుంతలు పడిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేస్తున్నారు. ఆయా ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవాంకా పర్యటించనున్న ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. ఐటీ కారిడార్, పాతబస్తీలోని రోడ్లు ఇప్పటికే తళతళ మెరుస్తున్నాయి. ఇరువైపులా పెయింటింగ్‌లతో, తెచ్చిపెట్టుకున్న పచ్చదనంతో కళకళలాడిపోతున్నాయి. ఈ విధంగా నగరంలో గత నెల రోజులుగా జరుగుతున్న తతంగం అంతా ఇంతా కాదు. ఇదంతా కేవలం ఇవాంకా నగరానికి వస్తుండడం వల్లే!

‘‘నడుములు విరిగిపోతున్నాయి, రోడ్లకు మరమ్మతులు చేయండి మహా ప్రభో’’ అని ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు ఇవాంకా కోసం ఏకంగా రోడ్లే వేసేస్తుండడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలా విమర్శలు చేస్తున్న వారి జాబితాలో తాజాగా ప్రముఖ గాయని సునీత కూడా చేరింది.

‘‘రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును’’ అని ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్ చేసింది. ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేసింది. సునీత పోస్టింగ్‌‌కు పలువురు మద్దతు పలుకుతూ అభినందిస్తున్నారు.

More Telugu News