Hyderabad: ఆరుగురు బాలికలపై ఆరు నెలలుగా లైంగిక దాడి.. 85 ఏళ్ల వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ షీటీమ్స్

  • చాక్లెట్లు, డబ్బు ఆశ చూపి బాలికలపై అత్యాచారం
  • నోట్ బుక్స్ తనిఖీతో వెలుగు చూసిన వృద్ధుడి పైశాచికం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూసి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న 85 ఏళ్ల వృద్ధుడి ఆట కట్టించింది హైదరాబాద్ షీ టీమ్స్ బృందం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ షేక్ సలీమా (షీ టీమ్స్) కథనం ప్రకారం.. కాప్రా ప్రథమపురి కాలనీకి చెందిన ఎన్.సత్యనారాయణరావు (85) మాజీ రైల్వే ఉద్యోగి. గతేడాది భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఇంటికి సమీపంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికలపై కన్ను వేసిన సత్యనారాయణ వారికి చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపించి ఇంటికి తీసుకెళ్లి గత ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

 గత కొన్ని రోజులుగా విద్యార్థినులు ముభావంగా కనిపించడం, హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయులు వారి నోటు పుస్తకాలను తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. వారి పుస్తకాల్లోంచి వంద రూపాయల నోట్లు కనిపించడంతో వారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి ఆరా తీశారు.
 
 సత్యనారాయణ తాత తమకు ఆ డబ్బులు ఇచ్చినట్టు చెప్పిన బాలికలు జరిగిన దారుణాన్ని వివరించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండడంతో కాలక్షేపం కోసమే వారిని పిలుస్తుండేవాడినని, అంతకుమించి వేరే ఉద్దేశం లేదని సత్యనారాయణరావు వివరించాడు.

More Telugu News