Aishwarya Rai: మీడియాను వారిస్తూ కన్నీరు పెట్టుకున్న ఐశ్వర్యారాయ్!

  • తండ్రి జయంతి రోజున 100 మంది గ్రహణం మొర్రి చిన్నారులకు శస్త్రచికిత్స చేయించిన ఐశ్వర్య 
  • 100 మంది చిన్నారులకు 2011లో ఆపరేషన్ చేయించిన ఐశ్వర్య తండ్రి
  • మీడియా రావడంతో ఇది వ్యక్తిగత కార్యక్రమమంటూ కన్నీటి పర్యంతం

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ మీడియాను వారిస్తూ ఉద్వేగానికి గురై కన్నీరుపెట్టుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఐశ్వర్య తండ్రి కృష్ణారాజ్‌ రాయ్‌ జయంతిని పురస్కరించుకుని ముంబైకి చెందిన స్మైల్ ఫౌండేషన్ సాయంతో గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు ఆమె సర్జరీ చేయించింది. అనంతరం వారితో ఐశ్వర్య ఆనందంగా గడిపింది. తన తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ కేక్ కట్ చేసింది. ఈ విషయం మీడియాకు చేరడంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు.

 దీంతో ఉద్వేగానికి గురైన ఐశ్వర్య.. వారితో "ప్లీజ్‌, నా ఫొటోలు తీయకండి. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలియదు. ఇది సినిమా ప్రీమియర్‌ షో కాదు. పబ్లిక్‌ ఈవెంట్‌ అంతకన్నా కాదు" అంటూ ఆమె సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటలను పట్టించుకోకుండా మీడియా ప్రతినిధులు ఫోటోలు, వీడియోలు తీయడంతో ఆవేదనకు గురైన ఐశ్వర్య "అసలు మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు?" అంటూ కన్నీటిపర్యంతమైంది.

కాగా, కృష్ణారాజ్‌ కూడా గ్రహణం మొర్రితోనే జన్మించారట. ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన ఆయన 2011లో 100 మంది గ్రహణం మొర్రి బాధిత చిన్నారులకు సర్జరీ చేయించారు. తండ్రి స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఆపరేషన్లు చేయించింది. 

More Telugu News