రేణుకా చౌదరి: అసెంబ్లీలో కేసీఆర్ సొల్లు కబుర్లు చెబుతున్నారు: కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై  రేణుకాచౌదరి, వీహెచ్ మండిపాటు
  • ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు
  • నకిలీ విత్తనాల ప్యాకెట్లపై ప్రభుత్వ ముద్ర
  • ఇందిరాగాంధీ శతజయంతిపై స్పృహలేని ప్రభుత్వాలు

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ సొల్లు కబుర్లు చెబుతున్నారని, అధికారులను ఇజ్రాయిల్ కి పంపడానికి అయ్యే ఖర్చును రైతులకు నష్టపరిహారంగా ఇవ్వొచ్చుగా? అంటూ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని ఖమ్మంలో 22 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, నకిలీ మిర్చి విత్తనాలతో రైతులు నష్టపోయారని ఆరోపించారు.

 నకిలీ విత్తనాల ప్యాకెట్లపై ప్రభుత్వ ముద్ర ఉందని, మరి, ఈ విత్తనాలకు ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ, ఇందిరాగాంధీ శతజయంతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పృహ లేదని, దేశంలో భూ సంస్కరణలు అమలు చేసిన ఘనత ఆమెదేనని అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని విస్మరించడమంటే పేదలను అవమానించడమేనని, అబద్ధాలు చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని, నోట్ల రద్దుతో పేదల జీవితాలను ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు.

More Telugu News