swiss banks: స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారికి ఇక చుక్కలే.. ఖాతాల వెల్లడికి స్విస్ పార్లమెంట్ ప్యానెల్ ఆమోదం

  • బట్టబయలు కానున్న నల్ల కుబేరుల బాగోతం
  • సమాచార మార్పిడికి స్విస్ పార్లమెంటరీ ప్యానల్ ఆమోదం
  • 2019లో తొలి సమాచార మార్పిడి

స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయ ప్రముఖుల భాగోతం బట్టబయలు కానుంది. నల్ల కుబేరుల వివరాలు వెల్లడి కాబోతున్నాయి. స్విస్ ఖాతాల సమాచారాన్ని భారత్ తో పంచుకునేందుకు స్విట్జర్లాండ్ పార్లమెంటులో కీలక ప్యానెల్ ఆమోదం తెలిపింది. స్విస్ ఖాతాల సమాచార మార్పిడికి భారత్ తో స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఒప్పందానికి ప్యానల్ అంగీకరించింది.

ఇదే సమయంలో స్విస్ ప్రభుత్వానికి ప్యానల్ కొన్ని సూచనలు చేసింది. సమాచార మార్పిడికి ఆమోదం తెలుపుతూనే, ఖాతాదారుల వ్యక్తిగత రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాలని సూచించింది. సమాచార మార్పిడి నేపథ్యంలో, ఎక్కడా చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలని తెలిపింది. నవంబర్ 27 నుంచి ప్రారంభంకానున్న స్విస్ పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం పలకనున్నారు.

ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే... స్విస్ బ్యాంక్ ఖాతాదారుల పేర్లు, చిరునామా, ఖాతా నంబరు, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ తదితర వివరాలను సంబంధిత దేశాలతో పంచుకునే అవకాశం స్విస్ కు లభిస్తుంది. భారత్-స్విట్జర్లాండ్ ల మధ్య ఈ ఒప్పందం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుండగా... 2019లో తొలి సమాచార మార్పిడి జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. తాము పంచుకునే సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని భారత్ సహా ఇతర దేశాలకు స్విట్జర్లాండ్ ఇప్పటికే స్పష్టం చేసింది.

More Telugu News