ys jagan: మగవాళ్లను చంపడమే చంద్రబాబు లక్ష్యం!: రోజా 'మహిళా గర్జన'

  • జాతీయ రహదారులను స్థానిక రోడ్లను చేసిన ఘనత చంద్రబాబుదే
  • 50 వేల మందికి ఓ వైన్ షాపు తెరిపించారు
  • ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం
  • 'మహిళా గర్జన'లో గర్జించిన రోజా

ఆంధ్రప్రదేశ్ లో పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని వైకాపా మహిళా నేత రోజా వ్యాఖ్యానించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో జరిగిన 'మహిళా గర్జన' సదస్సుకు హాజరై ప్రసంగించిన రోజా, ఏపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తూర్పారబట్టారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, తమ రహదార్లు జాతీయ రహదారులే కాదని, ఎన్నో ప్రధాన రోడ్లను ఒక్క జీవోతో డీ నోటిఫై చేసిన ఘనత చంద్రబాబు సర్కారుదేనని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడిముబ్బడిగా వైన్స్, బార్లను తెరిపించాడని, ఆడవాళ్ల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆడవాళ్ల కష్టాలు తీరుతాయని, జగనన్న మాటిస్తే, రాజన్న మాటిచ్చినట్టేనని, వైకాపా ప్రభుత్వం వస్తే, మద్య నిషేధం జరిగి తీరుతుందని రోజా హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను తెచ్చింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుని, ఆయన రక్తం పంచిన బిడ్డ జగన్ ను ఆదరించాలని అన్నారు.

More Telugu News