Shashi Tharoor: మిస్ వరల్డ్ మానుషి చిల్లార్‌పై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

  • నోట్ల రద్దుకు, మానుషికి ముడిపెట్టిన కేంద్ర మాజీ మంత్రి
  • చిల్లార్‌ను చిల్లరగా పోల్చుతూ ట్వీట్
  • దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
  • జాతీయ మహిళా కమిషన్ కన్నెర్ర 

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ వివాదంలో చిక్కుకున్నారు. 17 ఏళ్ల తర్వాత దేశానికి మిస్ వరల్డ్ కిరీటం అందించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన మానుషి చిల్లార్‌పై ‘చిల్లర’ వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దును మానుషితో ముడిపెట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ తో పాటు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సమన్లు జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమైంది. ఇంతకీ శశిథరూర్ ఏమన్నారంటే..

పెద్ద నోట్లను రద్దుచేసి ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పటికైనా గుర్తెరిగితే మంచిది. మన ‘చిల్లర’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ‘చిల్లర్’ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది’’ అని మానుషి చిల్లార్‌ను చిల్లరగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.

దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను చిల్లర వ్యక్తిగా పోల్చిన శశిథరూర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తాను చిల్లర వ్యక్తినని ఆయన మరోమారు తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టు ఉన్నాయని కొందరు కామెంట్ చేశారు. మానుషి జాట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో శశిథరూర్ మొత్తం జాట్లనే అవమానించారని మరికొందరు విరుచుకుపడుతున్నారు.

మానుషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్‌పై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషి విజయాన్ని తక్కువ చేసిన థరూర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయనకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది.

More Telugu News