Padmavathi: ‘పద్మావతి’ విడుదలను ఆపండి ప్లీజ్!.. స్మృతి ఇరానీని కోరిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

  • అవసరమైన మార్పులు చేసేంత వరకు రిలీజ్‌ను ఆపాలని లేఖ
  • చరిత్రకారులు, సినీ నిపుణులు, రాజ్‌పుట్‌లతో కమిటీ వేయాలని సూచన
  • ‘పద్మావతి’ని వీడని వివాదాలు

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న బాలీవుడ్ సినిమా ‘పద్మావతి’ రిలీజ్ కాకుండా చూడాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కేంద్ర సమాచార, ప్రసారశాఖామంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. సినిమాలో అవసరమైన మార్పులు చేర్పులు చేసేంత వరకు విడుదల కాకుండా అడ్డుకోవాలని అందులో కోరారు.

‘పద్మావతి’ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేముందు సెన్సార్ బోర్డు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాత పెట్టుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు సినిమాను వెనక్కి పంపిన మరుసటి రోజే వసుంధర ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చరిత్రకారులు, సినీ నిపుణులు, రాజ్‌పుట్ కమ్యూనిటీ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి వారు సినిమా చూసిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ రాజ్‌పుత్ కర్ణిసేన తొలి నుంచి ఆందోళన చేస్తోంది. ఇటీవల నిరసన మరింత ఉద్ధృతమైంది. బన్సాలీకి, దీపికకు బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

More Telugu News