Uttar Pradesh: నేరగాళ్లను జైలుకు పంపిస్తాం.. లేదంటే చంపేస్తాం: సీఎం యోగి ఆదిత్యనాధ్

  • రాష్ట్రంలో నేరగాళ్లకు చోటు లేదు
  • వారికిప్పుడు ఉన్నవి రెండే ఆప్షన్లు.. ఒకటి జైలు, రెండోది యమరాజు ఇల్లు
  • నేరాలు తగ్గడంతో రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు
  • మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని, పరిస్థితి మెరుగుపడిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నేరగాళ్లను జైలుకు పంపడమో, ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడమో చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘజియాబాద్‌లోని రామ్‌లీలా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘2017కు ముందు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండేది కాదు. నేరాలు ఇష్టానుసారం జరిగేవి. దీంతో భయపడిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, యువత రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వస్తున్నారు. పెట్టుబడులు వస్తున్నాయి’’ అని యోగి పేర్కొన్నారు. నేరగాళ్లకు ఇప్పుడు రెండే చోట్లు ఉన్నాయని, ఒకటి జైలుకు వెళ్లడం, లేదంటే యమరాజు ఇంటికి వెళ్లడమని వివరించారు. ఎక్కడికి వెళ్తారో వారే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

More Telugu News