vedanilayam: శశికళ అక్రమాస్తుల వ్యవహారంపై.. 'వేదనిలయం'లో ఐటీ శాఖ సోదాలు!

  • శశికళ అక్రమాస్తుల కేసులో వేదనిలయంపై ఐటీ శాఖ దాడులు
  • ఐటీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన శశికళ వర్గం కార్యకర్తలు 
  • ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్ లు స్వాధీనం

అన్నా డీఎంకే మాజీ నేత శశికళకు చెందిన 188 ఆస్తులపై ఐటీశాఖ ఇటీవల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సేకరించిన సమాచారంతో దివంగత జయలలితకు చెందిన చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌ లోని, వేద నిలయంలో గత అర్ధరాత్రి ప్రాంతంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకునే ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులకు ముందు శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జయ టీవీ సీఈవో వివేక్‌ కు ఫోన్‌ చేసి, వేద నిలయం తాళాలు తీసుకుని రావాలని సూచించారు.

 దీంతో ఈ వ్యవహారం శశికళ వర్గం అనుచరులకు తెలిసి, పెద్ద ఎత్తున అక్కడ గుమికూడి, ఐటీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సాయంతో వారిని దాటుకుని వెళ్లిన అధికారులు జయలలిత, శశికళ వ్యక్తిగత గదులతో పాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శి పూంగ్రునన్ గదులలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి ఒక ల్యాప్‌ టాప్, నాలుగు పెన్‌ డ్రైవ్‌ లు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ దాడులపై అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ వ్యాఖ్యానిస్తూ, తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఘోర అవమానం జరిగిందని, అమ్మ ఆత్మక్షోభిస్తుందని అన్నారు.

More Telugu News