tadipatri: జేసీ వర్గీయుల బార్ ముందు వైకాపా నిరసన... తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

  • ఇటీవలి కాలం వరకూ హిమగిరి ఏసీ రెస్టారెంట్
  • నూతన మద్యం దుకాణాల కేటాయింపు తరువాత బార్ గా మార్పు
  • జనావాసాల మధ్య బార్ ఏంటని నిరసనలు
  • భారీగా మోహరించిన పోలీసులు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్గీయులకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్ ముందు వైకాపా నిరసనలకు దిగడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనావాసాల మధ్య ఉన్న హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ వల్ల స్థానికులకు ఇబ్బంది కలుగుతోందని ఆరోపిస్తూ, వెంటనే దాన్ని మూసివేయాలని వైకాపా నేతలు నిరసన చేపట్టగా, వారిని అడ్డుకునేందుకు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు పెద్దఎత్తున అదే ప్రాంతానికి తరలివచ్చారు.

వైకాపా నిరసనల గురించి ముందే తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. వైఎస్ఆర్ నేత పెద్దారెడ్డి బార్ వద్దకు చేరుకున్న సమయంలో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలనూ చెదరగొట్టిన పోలీసులు, పట్టణంలో గస్తీని పెంచారు. ఇదిలావుండగా, ఈ బార్ జనావాసాల మధ్య ఉందని ఇప్పటికే తేల్చిన ఎక్సైజ్ పోలీసులు, నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల గడువు కోరిన నేపథ్యంలో ఈ నిరసనలు జరగడం గమనార్హం. ఇటీవలి కాలం వరకూ 'హిమగిరి ఏసీ రెస్టారెంట్'గా పట్టణ ప్రజలకు సుపరిచితమైన ఈ రెస్టారెంట్ ను నూతన మద్యం దుకాణాల కేటాయింపు తరువాత బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చారని తెలుస్తోంది.

More Telugu News