Delhi: ఇద్దరు చైన్ స్నాచర్లను మట్టికరిపించిన ధీర వనిత!

  • స్కూటీపై పారిపోతున్న దుండగులను చేజ్ చేసి పట్టుకున్న మహిళ
  • భర్త సాయంతో పోలీసులకు అప్పగింత
  • అభినందించిన పోలీసులు

తన బంగారు గొలుసును దొంగిలించిన ఇద్దరు చైన్ స్నాచర్లను ఛేజ్ చేసి మరీ పట్టుకుందో ధీర వనిత. ఢిల్లీలోని జగత్‌పురిలో చోటుచేసుకుందీ ఘటన. కోచింగ్ సెంటర్‌లో తన కుమారుడిని వదిలిపెట్టి తిరిగి ఇంటికి వస్తున్న రవీందర్ కౌర్‌పై స్కూటీపై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు దాడిచేసి ఆమె మెడలోని గొలుసును లాక్కుని పారిపోయారు.


 ‘తొలుత ఒకడు నా వీపుపై తట్టి దృష్టి మరల్చాడు. నేను వెనక్కి తిరిగి చూసే లోపు మరొకడు నా మెడలోని చైన్‌ను లాక్కున్నాడు’’ అని రవీందర్ తెలిపింది. వెంటనే తేరుకున్న ఆమె అరుస్తుండగా అప్పుడే వస్తున్న ఆమె భర్త దీపీందర్ కౌర్ చూశారు. అప్పటికే రవీందర్ పరిగెడుతూ స్కూటీపై వెనక కూర్చున్న వ్యక్తిని లాగేసింది.

దీంతో అదుపుతప్పిన స్కూటీ పడిపోయింది. అనంతరం అక్కడికి చేరుకున్న దీపీందర్‌తో కలిసి ఇద్దరిని కదలకుండా పట్టుకుంది. తన గొలుసు ఇవ్వమని కోరగా ఇచ్చేందుకు వారు తిరస్కరించారు. దీంతో వారి జీన్స్‌లో ఉన్న చైన్‌ను బలవంతంగా తీసుకున్నారు. ఈ ఘటనను చూసి గుమిగూడిన జనాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకున్న రవీందర్ కౌర్‌ తెగువను పోలీసులు అభినందించారు.

More Telugu News