నితిన్ గడ్కరీ: ఇకపై యూరిన్ కొనబడును.. లీటర్ కు ఒక్క రూపాయి చెల్లించనున్న ప్రభుత్వం!

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన
  • యూరిన్ బ్యాంక్ ల ఏర్పాటుకు నిర్ణయం
  • రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా ఇవ్వొచ్చు
  • పైలెట్ ప్రాజెక్టుగా మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తామన్న మంత్రి

దేశంలో ఎరువుల కొరత తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. ఒక లీటర్ యూరిన్ (మూత్రం)కు రూపాయి చెల్లించి కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూరిన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వాటి ద్వారా సేకరించిన మూత్రంతో యూరియాను తయారు చేయవచ్చని ఆయన తెలిపారు.

ఇలా చేయడం ద్వారా యూరియాను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా, అతి తక్కువ ధరకే నాణ్యమైన యూరియాను మన రైతులకు అందించవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో తాలూకా, తహశీల్దార్ కార్యాలయాల్లో యూరిన్ బ్యాంక్ లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

పైలెట్ ప్రాజెక్టుగా మొట్టమొదట మహారాష్ట్రలోని నాగ్ పూర్ దగ్గర ఉన్న ధాప్ వడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా పది లీటర్ల యూరిన్ ను యూరిన్ బ్యాంక్ కు అందిస్తే..లీటర్ కు రూపాయి చొప్పున పది రూపాయలు వారికి అందజేస్తామని గడ్కరీ పేర్కొన్నారు.

More Telugu News