laxmi's veeragrandham: 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా షూటింగ్ కు అంగీకరించని నిమ్మకూరువాసులు.. వెనుదిరిగిన యూనిట్!

  • 'లక్ష్మీ‘స్‌ వీరగ్రంథం' సినిమా షూటింగ్ కు మరోసారి ఇబ్బందులు
  • ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో సన్నివేశాల చిత్రీకరణకు ప్రయత్నం 
  • అభ్యంతరం చెప్పి అనుమతి ఇవ్వని గ్రామ పంచాయతీ
  •  నిరాశతో వెనుదిరిగిన చిత్రయూనిట్

ప్రకటన నాటి నుంచే వివాదానికి కేంద్రమైన 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాకు అడ్డంకులు తప్పడం లేదు. ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చిత్రీకరించడానికి ఇటీవల చిత్ర బృందం ప్రయత్నించింది. అయితే, దీనిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ చిత్రయూనిట్ ఎన్టీఆర్ స్వస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో జరిపేందుకు చేసిన ప్రయత్నాలను ఆ గ్రామ వాసులు అడ్డుకున్నారు.

 ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు పంచాయతీ పెద్దలను ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో సమావేశమైన పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు చిత్రీకరణకు అభ్యంతరం చెప్పారు. ఈ సినిమా కారణంగా ఎన్టీఆర్ తో పాటు నిమ్మకూరుకు కూడా చెడ్డపేరు వస్తుందని, అందుకే అనుమతి ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. దీంతో గ్రామస్థులకు ఇష్టం లేకుండా సన్నివేశాలు చిత్రీకరించమని చెబూతూ చిత్రయూనిట్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వెనుదిరిగారు. 

More Telugu News