actor sivaji: ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం: సినీ నటుడు శివాజీ

  • ప్రత్యేక హోదా ఎవడబ్బ సొత్తు కాదు
  • ప్యాకేజీ అన్నవాళ్లంతా భూస్థాపితమవుతారు
  • హోదా కోసం జగన్, పవన్ లు నడుం బిగించాలి

ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై కర్నూలులో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ నేత రామకృష్ణ, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సినీ నటుడు శివాజీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హక్కు ఎవడబ్బ సొత్తు కాదని... ఏపీ ప్రజల హక్కు అని అన్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.

ప్రత్యేక హోదాను సాధించడానికి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నడుం బిగించాలని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదానే కీలక అంశంగా మారబోతోందని... ప్రత్యేక ప్యాకేజీ అన్నవాళ్లు భూస్థాపితమవుతారని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఉన్న ఎంపీల్లో 72 శాతం మంది వ్యాపారస్తులే ఉన్నారని... పేదల కష్టాలు వీరికెలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News