laxmis'veera grandham: 'లక్ష్మీస్ వీరగ్రంథం' షూటింగ్ మొదటి రోజే అడ్డంకి?... లక్ష్మీ పార్వతిని హెచ్చరించిన దర్శకుడు!

  • షూటింగ్ కు అనుమతి లేదన్న పోలీసులు
  • అనుమతి పత్రం చూపించిన దర్శకుడు
  • అందులో వివరాలేవీ లేవని అభ్యంతరం చెప్పిన పోలీసులు

‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమా షూటింగ్‌ కు తొలిరోజే అడ్డంకి ఎదురైంది. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ సినిమా షూటింగ్ ను చిత్రయూనిట్ ఆరంభించింది. అయితే చిత్రయూనిట్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినిమా చిత్రీకరణకు అనుమతి లేదని వారు అభ్యంతరం తెలిపారు. దీంతో తాను అనుమతి తీసుకున్నానంటూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, అనుమతి పత్రంలో సినిమా పేరు, దానికి సంబంధించిన వివరాలు లేవంటూ షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఎన్టీఆర్ ఆత్మప్రబోధం మేరకు సినిమా తీస్తున్నామని అన్నారు. తమ సినిమాకు లక్ష్మీ పార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి, ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. తానేమీ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై లక్ష్మీ పార్వతికి అభ్యంతరం ఏంటని అడిగారు.

తాను 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను చంద్రబాబు కోణంలోంచి తీస్తున్నానని ఆయన చెప్పారు. తన సినిమా పూర్తయిన తరువాత, అది చూసిన తరువాత లక్ష్మీ పార్వతికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో చూసుకోవాలని సూచించారు. తాను కూడా కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన తెలిపారు.  

More Telugu News