ntr: రామయ్యను దర్శించుకున్న ఎన్టీఆర్.. ఆలయం వద్ద తోపులాట!

  • సతీసమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న యంగ్ టైగర్
  • సీతారాములకు పట్టు వస్త్రాల సమర్పణ
  • ఆలయం వద్దకు భారీగా తరలి వచ్చిన అభిమానులు

వరుస హిట్లతో దూసుకెళుతున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భద్రాచల రామయ్యను దర్శించుకున్నాడు. తన సతీమణి లక్ష్మీప్రణతితో కలసి ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నాడు. ఆలయం వద్దకు వెళ్లిన వీరికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాములకు ఎన్టీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. దర్శనానంతరం వీరికి అర్చకులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. భద్రాద్రి విశిష్టతను తెలియజేశారు.

మరోవైపు, ఎన్టీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తోపులాట కూడా జరిగింది. ఎన్టీఆర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఎన్టీఆర్ కూడా తన అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరిని పలుకరిస్తూ తన దర్శనాన్ని ముగించుకున్నాడు.

More Telugu News