raghuram rajan: కేజ్రీవాల్ ఇచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిన రఘురాం రాజన్!

  • రాజ్యసభ సీటును ఆఫర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
  • విద్యారంగాన్ని రాజన్ వీడబోరు
  • స్పష్టం చేసిన యూనివర్శిటీ ఆఫ్ షికాగో

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ రాజ్యసభ ఆఫర్ ను తిరస్కరించారు. ఆయన అంగీకరిస్తే, తమ పార్టీ తరఫున పెద్దల సభకు పంపుతామని ఆమ్ ఆద్మీపార్టీ చేసిన ప్రతిపాదనను రాజన్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. త్వరలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో తమకు మూడు సీట్లు లభిస్తాయని, వాటిల్లో ఒకటి అంగీకరిస్తే, రాజన్ కు ఇస్తామని ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిపై వివరణ కోరుతూ యూనివర్శిటీ ఆఫ్ షికాగోకు ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి. వర్శిటీ అధికారికంగా స్పందిస్తూ, రాజన్ ఇండియాలోనూ ఎన్నో విద్యా సంబంధ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారని, ఓ ప్రొఫెసర్ గా విద్యా బోధనా రంగంలో ఉండటమే ఆయనకు సంతోషకరమని, దాన్ని వదలాలన్న ఎటువంటి ఆలోచనలోనూ ఆయన లేరని స్పష్టం చేసింది.

కాగా, రాజన్ వంటి వ్యక్తి రాజ్యసభలో ఉంటే, దేశం మరింత వేగంగా ముందుకు సాగేందుకు అవసరమైన సలహాలు, సూచనలు వస్తాయని, వాటిని వేగంగా అమలు చేసే వీలు కలుగుతుందని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధికి చీఫ్ ఎకానమిస్ట్ గా అత్యంత చిన్న వయసులోనే... అంటే 40 ఏళ్లకే ఆయన సేవలు అందించిన సంగతి తెలిసిందే. 2008లో ఆర్థిక మాంద్యం ఏర్పడనున్నదని రాజన్ 2005లోనే అంచనా వేశాడు. ఆ విషయాన్ని అప్పట్లో ఆర్థికవేత్తల వార్షిక సమావేశంలో చెప్పాడు కూడా. ఆపై మూడేళ్లకు ఆయన చెప్పిన విషయం కళ్ల ముందుకు రాగా, ప్రపంచమంతా రాజన్ పేరు మారుమోగింది.

More Telugu News